రాజశేఖర్ కోలుకుంటున్నారు: జీవిత
కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్న నటుడు రాజశేఖర్ కోలుకుంటున్నారని ఆయన ఆరోగ్యం మెరుగయ్యిందని ఓ వీడియోలో ఆయన భార్య జీవిత వెల్లడించారు. రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉందని వైద్యానికి ఆయన సహకరిస్తున్నారని తెలిపారు. మొదట చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారని, ఆ సమయంలో తమతో పాటు వైద్యులు చాలా భయపడ్డారని జీవితా రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎన్సీ ఆసుపత్రి వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తూ ఆయనను ప్రాణపాయం నుంచి బయటపడేశారని తెలిపారు. అయితే రాజశేఖర్ వెంటిలేటర్ మీద ఉన్నారనే వార్తలను జీవిత కొట్టివేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకు ఎప్పుడూ వెంటిలేటర్ మీద చికిత్స అందించలేదని, ఆ వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. ఐసీయూలోనే ఆక్సీజన్ అందిస్తూ చికిత్స చేశారని వివరించారు. త్వరలోనే ఐసీయూ నుంచి బయటకొచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. రాజశేఖర్ కోలుకోవాలని మిత్రులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు చేసిన ప్రార్థనలే ఆయనను కోలుకునేలా చేశాయని అన్నారు.