ఘనంగా రమణం స్వామినాయుడు జన్మదిన వేడుకలు

విజయనగరం : అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణం స్వామినాయుడు జన్మదినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక నిరాశ్రయుల వసతి గృహంలో జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పళ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వారి సమక్షంలో కేక్‌ను కట్‌ చేసి జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జనసేన నాయకులు గురాన అయ్యలు మాట్లాడుతూ మెగాస్టార్‌ చిరంజీవి ఆశయ సాధన కోసం రమణం స్వామినాయుడు నిరంతరం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. అభిమానులందరినీ ఏకతాటిపై నడిపిస్తూ విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో దశాబ్దాల కాలంగా సేవకుడిగా పనిచేస్తున్నారని కొనియాడారు. రమణం స్వామినాయుడుని స్ఫూర్తిగా తీసుకుని మెగా అభిమానులందరూ సేవా కార్యక్రమాలను విస్తరితం చేయాలని పిలుపునిచ్చారు. మెగా అభిమానులకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు, సీనియర్‌ అభిమాని కె.కృష్ణారావు, చిరంజీవి యువత సభ్యులు, జనసేన యువ నాయకులు పిడుగు సతీష్‌, లాలిశెట్టి రవితేజ, వజ్రపు నవీన్‌, ఎం.పవన్‌కుమార్‌, వై.నలమరాజు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.