అరసవల్లిలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు..

ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి పర్వదినంగా, సూర్య జయంతిగా భక్తజనులు ఘనంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అరసవల్లి సూరీడు అందరి దేవుడు. అందుకే అనాది నుంచి ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుని నిజరూప దర్శనం భక్తులకు మరపురాని మధురానుభూతిని కలిగించే ఘట్టంగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే అర్ధరాత్రి నుంచే అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

ముందుగా విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి, ఆలయ ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుజాత స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామికి మహాక్షీరాభిషేకం జరిగింది. స్వామివారి నిజరూపాన్ని వీక్షించేందుకు రాత్రి నుంచే క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు. నగర ప్రధాన వీధుల్లో అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడి మొదలైంది.