విద్యాసంస్థల రి-ఓపెన్.. మంత్రి సబితా క్లారిటీ

తెలంగాణాలో విద్యాసంస్థల పునః ప్రారంబం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న తరుణంలో విద్యా సంస్థలు తెరిచే అలోచనే లేదని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ, కొరోనా మహమ్మారి ప్రభావం విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మార్చి 16 నుంచి పాఠశాలలను మూసివేయడం జరిగిందన్నారు. లాక్‌డౌన్ సమయంలో పరీక్షల నిర్వహణపై కూడా ఆందోళన కూడా నెలకొందని అయితే సీఎం చొరవతో అన్ని తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు తెరుస్తామని స్పష్టం చేశారు. విద్యార్ధులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఆన్‌లైన్ క్లాసులకు ఏర్పాటు చేసి, విద్యార్థులందరికీ ఉచితంగా బుక్స్‌ను పంపిణీ చేశామని తెలిపారు.