తాజాగా తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు..కోలుకున్న బాధితులు

తెలంగాణలో ఆదివారం కరోనా వైరస్ కేసులు కొద్దిపాటి తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్రంలో తాజాగా 1256 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80,751కి చేరింది. చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 57,586 మంది డిశ్చార్జ్ కాగా, 637 మంది మరణించారు. ఆదివారం పది మంది కోవిడ్19తో మరణించారు.

నిన్న ఒక్కరోజే 1587 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,528 యాక్టీవ్ కేసులున్నాయి. రికవరీ రేటు దేశంలో 68.78 శాతం ఉండగా, తెలంగాణలో కరోనా రికవరీ రేటు 71.31శాతంగా ఉంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 389 కేసులు నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే రంగారెడ్డిలో 86, సంగారెడ్డి 74, కరీంనగర్ 73, వరంగల్ అర్బన్ 67, ఆదిలాబాద్ 63, నల్గొండ 58, సిద్దిపేటలో 45 చొప్పున తాజాగా కరోనా కేసులను నిర్ధారించారు.