తెలంగాణలో సోమవారం వరకు రిజిస్ట్రేషన్లు బంద్

హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్‌డీసీ)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వ వెబ్‌సైట్ సేవలకు అంతరాయం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

ఈ నేపథ్యంలో నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగవని తాజాగా పేర్కొంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్ట్రేషన్లకు ప్రాతిపదికగా ఉన్న కార్డు విధానం, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ సేవలు గతరాత్రి ఏడు గంటల నుంచే నిలిచిపోయాయి. కాబట్టి  రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లతోపాటు ఇతర సేవలు కూడా అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం తిరిగి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.