కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ పిటిషన్‌ కొట్టివేత

కాంట్రాక్టు డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్లను క్రమబద్ధీకరించవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించకుండా ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని 2016లో కొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు రూపొందించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లి విచారణ జరిపారు.

ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరించిందా అని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. క్రమబద్ధీకరిస్తారంటూ ఊహించుకొని పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారని అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్‌ వేసిన 24 మంది నిరుద్యోగులపై సీజే హిమాకోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు రూ.10 వేలు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.