విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి: జగన్ సర్కార్

ఏపీలోని జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాల పరిధిలో, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సంబంధిత పురపాలక సంఘం పరిధిలోనే నివాసం ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గవర్నమెంట్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను వందశాతం వారికి చేరవేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల్లో పని చేస్తున్న సిబ్బంది అంతా వారు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

ఇప్పటికే ఉన్న ఈ రూల్స్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. డివిజనల్‌, మండల స్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి సచివాలయ సిబ్బంది స్థానికంగానే నివాసం ఉంటూ విధులు నిర్వర్తించేలా పర్యవేక్షణ చేస్తూ, చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధనలు అతిక్రమించిన వారి జాబితాను ఉన్నతాధికారులకు పంపాలని సూచించింది.