రేవంత్ రెడ్డి ధర్నాలో తప్పిన ప్రమాదం.. కారు దగ్ధం..

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధర్నాలో ప్రమాదం తప్పింది. భారత్ బంద్‌లో భాగంగా రేవంత్ స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు,రేవంత్ మద్దతుదారులు భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో బాణసంచా నిప్పు రవ్వలు ఓ కారుపై పడి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైపోయింది. మంటలు భారీగా ఎగసిపడటంతో దీక్షా శిబిరం వద్ద ఉన్న కార్యకర్తలు పరుగులు పెట్టారు. వెంటనే ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ… అప్పటికే కారు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు చెబుతున్నారు. కాగా,కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు మంగళవారం(డిసెంబర్ 8) భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్‌కు కాంగ్రెస్ సహా 18 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.