దేశంలో పెరుగుతున్న యూకే కరోనా కేసులు

యూకే కరోనా స్ట్రెయిన్ ఇండియాలో కలవరం కల్గిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరగడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. యూకే  నుంచి ప్రారంభమైన కొత్త కరోనా స్ట్రెయిన్ ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో యూకే కరోనా స్ట్రెయిన్ కేసులు 109కు చేరుకున్నాయి. జనవరి 11వ తేదీకి 96 ఉన్న కేసులు..కేవలం మూడ్రోజుల్లోనే అంటే జనవరి 14 నాటికి 109కు చేరుకోవడం గమనార్హం. ఇదే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కలవరానికి కారణమైంది. యూకే కరోనా స్ట్రెయిన్ బ్రిటన్‌లో ప్రారంభమైనప్పటి నుంచే ఇండియా యూకేకు విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ఇటీవల జనవరి 8 నుంచి తిరిగి ప్రారంభించినా…పూర్తిగా నిబంధనలు పాటిస్తూ నడుపుతోంది.

యూకే నుంచి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్ పోర్ట్  లోనే పరీక్షలు నిర్వహించి 14 రోజుల క్వారెంటైన్ పాటించేలా చర్యలు తీసుకుంటోంది. యూకే స్ట్రెయిన్ ప్రభావం ఇప్పటికే అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్ దేశాలకు సోకింది. ఫలితంగా ఈ దేశాల్లో కొత్తగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.