రేపటి నుండి ఎస్‌ఈసీ ప్రాంతీయ సమావేశాలు

అమరావతి: ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ నిర్ణయించారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రాంతీయ సమావేశాలు జరపనున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్‌ఈసీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించనున్నారు.

ఈ నెల 27న తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్సిటీ సెనేట్‌ హాల్‌లో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల అధికారులతో తొలి సమావేశం జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 5.30 వరకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, మున్సిపల్‌ కమిషనర్‌ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఐదు జిల్లాల్లో గుర్తింపు, రిజిస్ట్రేషన్‌ పొందిన రాజకీయ పార్టీల నేతలతో ఎస్‌ఈసీ సమావేశమవుతారు.

ఈనెల 28న విజయవాడలోని తన కార్యాలయంలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో ఎస్‌ఈసీ సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు నాలుగు జిల్లాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అవుతారు. మార్చి 1న విశాఖపట్నం లో మూడో రీజినల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం 3.15గంటల నుంచి 5.30 వరకు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం 6గంటలకు నాలుగు జిల్లాల్లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ సమావేశమవుతారు.

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత, నిఘా ఏర్పాటు, మద్యం సరఫరా నివారణ, ఓటరు స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై ఆదేశాలివ్వనున్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ, కొవిడ్ నివారణ, ఓటు హక్కు వినియోగం కోసం ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం తదితర అంశాలపై అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు ఇస్తారు. ఈమేరకు రీజినల్ సమావేశాలకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు.