షిర్డీ సాయి ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం.. ఆలయం మూసివేత

మహారాష్ట్రలో కరోనా భారీ స్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసివేయనున్నారు. కొవిడ్‌ కట్టడి కోసం కఠిన ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌ వెల్లడించింది.

సోమవారం సాయంత్రం 8 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆలయం మూసివేయనున్నట్లు ట్రస్ట్‌ తెలిపింది. అయితే, ఆలయంలో రోజువారీ పూజాకార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ట్రస్ట్‌ ప్రతినిధి రవీంద్ర థాకరే  వెల్లడించారు. అయితే, భక్తుల్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. అలాగే వారాంతంలో లాక్‌డౌన్‌ విధించనుంది.