మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు స్వామివారు మలయప్పస్వామి మోహినీ అవతారంలో భక్తులను అనుగ్రహించారు. పక్కనే పల్లకీపై కృష్ణుడి రూపంలోనూ స్వామివారు దర్శనమిచ్చారు. వేంకటేశ్వరుడి ముగ్ధ మనోహర మోహిని రూపం.. వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడి రూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. స్వామివారి అవతారాలన్నింటిలో మోహినీ అవతారం అత్యంత ప్రధానమైంది. రంగురాళ్లు పొదిగిన ప్రత్యేకమైన ఆభరణాలు ధరించి, ఒక చేతిలో చిలుకను పట్టుకొని సింహాసనంపై హుందాగా కూర్చొని స్వామి వారు భక్తులను సమ్మోహనపరిచారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా రాత్రి స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.