Paralympics: సుహాస్ యతిరాజ్‌కు రజతం.. 18కి చేరిన భారత పతకాల సంఖ్య

జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌ చివరి రోజు భారత్‌కు మరో పతకం సొంతమైంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్ 4 విభాగంలో సుహాస్ యతిరాజ్ భారత్‌కు రజత పతకం అందించాడు. ప్రపంచ నంబర్ వన్, ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ మజుర్‌తో కొద్దిసేపటి క్రితం జరిగిన ఫైనల్‌లో ఓటమి పాలైన సుహాస్ రజతంతో సరిపెట్టుకున్నాడు. దీంతో కలుపుకుని పారాలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 18కి చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.

పతకాల పట్టికలో భారత్ 27వ స్థానానికి ఎగబాకింది. కాగా, బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌హెచ్ 6 విభాగంలో భారత షట్లర్ కృష్ణా నాగర్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన చు మన్ కైతో తలపడుతున్నాడు. ఈ పోరులో గెలిస్తే భారత్‌ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరుతుంది. ఓడితే రజతం వస్తుంది. కాగా, సుహాస్ యతిరాజ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన యూపీలోని నోయిడా జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తున్నారు.