Paralympics: స్వర్ణంతో అదరగొట్టిన కృష్ణ నాగర్‌

పారాలింపిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6లో కృష్ణ నాగర్‌ స్వర్ణంతో అదరగొట్టాడు. ఫైనల్లో హాంకాంగ్‌ ఆటగాడు కైమన్‌ చూపై కృష్ణ విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. ఈరోజు ఇప్పటికే భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. ఈ ఉదయం బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-4 విభాగంలో సుహాస్‌ యతిరాజ్‌ రజతం సాధించగా తాజాగా కృష్ణ స్వర్ణం తీసుకొచ్చాడు. దీంతో పారాలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది. వీటిలో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.