Supreme Court: కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం..

సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. న్యాయస్థానం చరిత్రలో తొలిసారి న్యాయమూర్తుల ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం మాత్రమే ప్రత్యక్ష ప్రసారమయ్యేది. ఇప్పుడు తొలిసారిగా న్యాయమూర్తుల బాధ్యతల స్వీకారం కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంతేగాక, ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయడం కూడా ఇదే మొదటిసారి.

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం పంపిన 9 మంది పేర్లను ఇటీవల రాష్ట్రపతి ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో నేడు వారంతా బాధ్యతలు స్వీకరించారు. కొత్త న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రమాణం చేయిస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా ఈసారి ప్రమాణస్వీకార వేదికను మార్చారు. 1వ కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా.. అదనపు భవనం ఆడిటోరియానికి మార్చారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ఎక్కువ స్థలం కోసం అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

నేడు మొత్తం 9 మంది ప్రమాణస్వీకారం చేయగా.. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బేలా త్రివేది సహా.. జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ నేడు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.