అమీర్ పేటలో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన తలసాని

అతి త్వరలో అమీర్ పేటలోని ఆస్పత్రిలో డయాలసిస్ సేవలను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం అమీర్ పేటలో రూ.4.53కోట్లతో నిర్మించిన 50 పడకల హాస్పిటల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. “పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్ద మనసుతో 50 పడకల హాస్పిటల్ నిర్మాణానికి అనుమతించి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు. 6 పడకలుగా ఉన్న ఈ హాస్పిటల్ ను 30 పడకలకు పెంచుతూ 2012 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 2.97 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కానీ నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చాను. దీంతో 2017 సంవత్సరంలో 50 పడకల హాస్పిటల్ గా నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ 7.47 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

2018 సంవత్సరంలో పనులు చేపట్టినప్పటికీ కరోనా కారణంగా నిర్మాణ పనులు మధ్యలో కొద్ది రోజుల పాటు నిలిచిపోయాయి. జి ప్లస్ 2 పద్దతిలో హాస్పిటల్ భవనాన్ని ఒక్కో ప్లోర్ ను నిర్మించారు. ఈ హాస్పిటల్ కు వచ్చే పేషంట్స్ కోసం అల్ట్రా సౌండ్ స్కానర్, ఈసిజి, ఎక్స్ రే, ఇతర అత్యాధునిక వైద్య పరికరాలను 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ద్వారా అమీర్ పేట, సనత్ నగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, శ్రీ నగర్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుతాయి. ప్రభుత్వ వైద్య సేవల కోసం దూర ప్రాంతాల్లో ఉన్న గాంధీ, ఉస్మానియా వంటి హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రజలు కూడా ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి.భవిష్యత్ లో ఈ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా. ఇప్పటికే బస్తీ దవాఖానలను ప్రారంభించి ప్రజల చెంతకు వైద్య సేవలు తీసుకెళ్లాం” అని అన్నారు. హాస్పిటల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మరో 50 పడకల హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టిఎస్ఎండిఐడిసి అధికారులను మంత్రి ఆదేశించారు.