ఉద్యోగుల కుటుంబాలకు బాసటగా ‘టాటా స్టీల్‌’

జంషేడ్‌పూర్‌: కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తూ అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్న నేపథ్యంలో టాటా స్టీల్‌ తన ఔదార్యాన్ని చాటుకుంది. తమ సంస్థలో కరోనా బారిన పడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పించేందుకు ముందుకు వచ్చింది. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి.. ఆ ఉద్యోగి రిటైర్మెంట్‌ వయసు వచ్చే వరకు ప్రతి నెలా ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించింది. ఉద్యోగి తన చివరి నెల వేతన రూపంలో తీసుకున్న మొత్తాన్ని ఆ కుటుంబీకులకు ప్రతి నెలా అందించనున్నట్లు ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా టాటా స్టీల్ కంపెనీ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

ఇక కంపెనీలో పనిచేస్తూ కరోనా బారిన పడి మరణించిన ఫ్రంట్‌లైన్ వర్కర్ల పిల్లల గ్రాడ్యుయేషన్‌ చదువుల వరకు కంపెనీయే మొత్తం ఖర్చును భరించనున్నది. నెల వేతనం అందించడంతో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్ల కుటుంబాలకు ఈ అదనపు సాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. జంషేడ్‌పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్‌ ఔదార్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా నెటిజన్లు టాటా సంస్థ, సంస్థ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటాను ప్రశంసిస్తున్నారు.