విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ జగన్‌ అహంకార ధోరణికి నిదర్శనం: నారా లోకేష్‌

శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్‌మోహన్‌ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. లోకేష్‌ మాట్లాడుతూ… అనంతపురంలో ఎస్‌ఎస్‌బిఎన్‌ ఎయిడెడ్‌ కళాశాల వద్ద విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. విద్యార్థుల పై లాఠీఛార్జ్‌ చేసిన పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ” ఎయిడెడ్‌ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా ? విద్యార్థి ఉద్యమాలను అణిచివేయాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం. ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసిపి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఇచ్చిన జిఓలు రద్దు చేయాలి ” అని నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు.