కంభంపాటి హరిబాబును గవర్నర్ గా నియమించిన కేంద్రం

ఏపీ బీజేపీ నేత, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును పార్టీ అధిష్ఠానం సముచిత స్థానంతో గౌరవించింది. పార్టీ కోసం ఆయన చేసిన సేవలకు గాను గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఈరోజు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేసింది.

మధ్యప్రదేశ్ గవర్నర్ గా మంగూభాయ్ ఛగన్ భాయ్ పటేల్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్రన్ విశ్వనాథ్ పర్లేకర్, గోవా గవర్నర్ గా పీఎస్ శ్రీధరన్ పిళ్లై, త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఝార్ఖండ్ గవర్నర్ గా రమేశ్ భయాట్, కర్ణాటక గవర్నర్ గా థావర్ చంద్ గెహ్లాట్ లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు అన్ని పార్టీల నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.