Srikalahasti: ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలి – శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి, 10 రోజులుగా బారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించి, వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని MM వాడ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. MM వాడ ప్రజల కష్టాలు వర్ణనాతీతం. వారం రోజులుగా పడుతున్న వర్షాలకు పైన ప్రాంతంలోని నీరు మొత్తం లోతట్టు ప్రాంతం అయిన MM వాడను ముంచెత్తాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహకారం వారికి అందించలేదు. రోజు వారీ కూలికి వెళ్తే కానీ పూట గడవని అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే డ్రైనేజీ కాలువలు లేక అపరిశుభ్రం మురికి వాడలా ఉంటుంది, అలాంటిది వర్షం ఇన్ని రోజులు పడుతుంటే అన్ని ఇళ్ళలోకి పట్టణంలోని డ్రైనేజీ నీళ్ళు వచ్చి చేరాయని మహిళలు ఆవేదన, భాధను వ్యక్తం చేశారు. స్ట్రీట్ లైట్స్ కూడా లేక కుగ్రామాన్ని తలపించేలా మునిసిపాలిటీలోని వార్డు ఉండడం దురదృష్టకరం. ఈ సందర్భంగా శ్రీమతి వినుత ప్రజలకు అండగా నిలబడతామని ఈ సమస్యలను వెంటనే మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ తెలియజేస్తామని, వెంటనే ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, ఆ ప్రాంతంలో డ్రైనేజీని శుభ్రపరచాలని కమిషనర్ ని డిమాండ్ చేశారు.