ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన ధ్యేయమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసే వారిని, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరి సేవలను పార్టీ గౌరవిస్తుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాదులోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఉత్తరాంధ్రకు చెందిన విద్య, సామాజిక రంగ నిపుణులు శ్రీ నాగబాబు గారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడుతూ “జనసేన తీసుకుంటున్న సామాజిక బాధ్యతకు మద్దతు తెలుపుతూ పలువురు పార్టీ కార్యాలయానికి తరలి రావడం, జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ట్రంలో ఎక్కడ సమస్య నెలకొన్నా జనసేన వైపే జనం చూస్తున్నారు. పార్టీ దృష్టికి తీసుకువెళ్తే సమస్య పరష్కారమవుతుందనే భావన ప్రజల్లో నెలకొంది. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత జనసేన తీసుకుంటుంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు- సమస్యలతో వచ్చిన ప్రజలకు చేయూతనిచ్చి వారికి అండగా నిలవాల”ని సూచించారు.