కులముద్ర వేయడానికే వైసీపీ కాపు నాయకుల సమావేశం

గురజాల, వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఏర్పాటు చేసుకున్న మీటింగ్ కేవలం జనసేనకు కులాన్ని ఆపాదించాలని చేసిన కుట్ర అని జనసేన జిల్లా కార్యదర్శి కటికం అంకారావు మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాపు సామాజికవర్గ సమావేశమని, బ్యానర్ లో ఒక్క కాపు నాయకుడి ఫోటో కూడా లేకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. వంగవీటి రంగాను హత్య చేయటం తప్పులేదని, వ్యాఖ్యలు చేసిన గౌతమ్ రెడ్డికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు, మీరంతా ఏమైపోయారు?స్వాతంత్రం వచ్చిన నాటి నుండి రాజంపేట ఎంపీ టికెట్ బలిజలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి వచ్చిన తర్వాత, మిథున్ రెడ్డికి ఇచ్చినప్పుడు మీరంతా ఎందుకు ప్రశ్నించలేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు జగన్మోహన్ రెడ్డి ఎత్తేస్తే ఎందుకు నోరు మెదపలేకపోయారని ఆయన అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి ₹2,000 కోట్ల రూపాయలు ఇస్తానన్న జగన్ మోహన్ రెడ్డి, ఆ హామీని తుంగలో తొక్కినప్పుడు, మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఎవడన్న కులం మీటింగ్ పెట్టుకొని తన కులంవాడికి ఓట్లు వెయ్యాలి అని తీర్మానం చేసుకుంటారు. కానీ మీరు భారతదేశ చరిత్రలో మన కులంవాడికి ఓట్లు వేయకూడదని, మీటింగ్ పెట్టుకోవడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు.