కాపులతోపాటు సామాజికంగా వెనకబడినవారు శాసించే స్థాయికి ఎదగాలి..

కాపులతోపాటు ఆర్థికంగా, సామాజికంగా అణగారిన అన్ని వర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. 1930 నుంచే కాపు కులంలో విభజించు, పాలించు సిద్ధాంతం మొదలయ్యిందని, అది ఈ రోజుకీ కొనసాగుతోందన్నారు. కాపులకు రాజకీయ సాధికారిత వచ్చిన రోజు… మిగిలిన అన్ని వెనుకబడిన కులాలకు విముక్తి లభిస్తుందని చెప్పారు. బీసీ కులాలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు నేతృత్వంలోని బృందంతో సమావేశమయ్యారు. 

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కులం అనేది మనం ఎంచుకునేది కాదు. మన ప్రమేయం లేకుండా మనం పుట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు రెల్లి కులంవారి అవస్థలు చూసి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉండాలని రెల్లి కులాన్ని స్వీకరించాను. పొలిటికల్, సోషల్ ఫిలాసఫీని సంపూర్ణంగా అధ్యయనం చేసి రాజకీయాల్లోకి వచ్చాను. ఏదైనా మాట మాట్లాడితే కులం అంటగట్టేస్తారనే భయం నాకు లేదు.  ప్రతి కులం ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకొన్నప్పుడు.. నేను పుట్టిన కులం నా దగ్గరకు వచ్చి సమస్యలను విన్నవించుకోవడం తప్పేమి కాదు. దానికి కులం అంటగడతారనే భయం అవసరం లేదు. నా మనసు, ఆలోచన ప్రజలకు తెలుసు. నేను అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెంది నవాడిని. ప్రతి కులంలో వెనకబాటు తనం గురించి మాట్లాడటానికి ఏ మాత్రం సంకోచించను.