రాజ్నాథ్సింగ్ కు సినిమా స్క్రిప్టు అందజేసిన ‘తేజస్’ బృందం
బాలీవుడ్ అగ్రనటి కంగన రనౌత్ ‘తలైవి’ సినిమా షూటింగ్ ముగింపు అనంతరం మరో సినిమా పనుల్లో మునిగిపోయింది. ఆమె తన తర్వాతి సినిమా ‘తేజస్’లో భారత వైమానిక దళ పైలట్గా కనిపించనుంది. తాజాగా తన చిత్రబృందంతో కలిసి కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసింది. ఈ సందర్భంగా స్క్రిప్టును ఆయనకు అందజేసింది. ఈ విషయాన్ని కంగన ట్విటర్లో అభిమానులతో పంచుకుంది. ‘ఈరోజు గౌరవ రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ గారిని మా తేజస్ బృందం కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది. సినిమా అనుమతి కోసం భారత వైమానిక దళ (ఐఏఎఫ్) మీడియా కో-ఆర్డినేషన్ సెంటర్తో సినిమా స్క్రిప్టును కూడా పంచుకున్నాం’ అని రాజ్నాథ్సింగ్ను కలిసిన ఫొటోలను కంగన ట్విటర్లో పోస్టు చేసింది.
కంగన ప్రస్తుతం ‘తేజస్’, ‘ధాకాడ్’ సినిమాల లో నటిస్తుంది. ‘తేజస్’లో పైలట్గా కనిపించనున్న ఆమె అభిమానులను మెప్పించేందుకు తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్లో వర్క్షాపులకు కూడా హాజరయ్యారు. ఈ సినిమాకు సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన కంగన ఫస్ట్లుక్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంటోంది.