కరోనా నియంత్రణ చర్యల పట్ల తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
తెలంగాణలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా విజృంభణపై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు… జన సంచారాన్ని తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది.
అధికంగా జనాలు ఉండే సినిమా థియేటర్లతో పాటు పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. రాష్ట్ర సర్కారు తమకు సమర్పించిన నివేదికలో కనీస వివరాలు కూడా ఉండడం లేదని తెలిపింది. దీంతో జన సంచారం నియంత్రణకు సర్కారు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని న్యాయస్థానానికి ఏజీ చెప్పారు.
దీంతో హైకోర్టు స్పందిస్తూ ఓ పక్క ప్రజల ప్రాణాలు గాల్లో తేలియాడుతున్నాయని, ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించింది. అసలు సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందా? లేక కోర్టే ఆదేశాలు ఇవ్వాలా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కారు నిర్ణయాలను మధ్యాహ్నంలోగా సమర్పించాలని, భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామని తెలిపింది.