తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉండదు: కేసీఆర్‌

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో తాత్కాలికంగానే విద్యాసంస్థలు మూసివేశామని, తొందరపడి లాక్‌డౌన్‌ పెట్టబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌ డౌన్ విధించమన్నారు. మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా విస్పోటనమైన రూపం తీసుకోక ముందే చర్యలు తీసుకున్నామన్నారు. బాధతోనే విద్యాసంస్థలు మూసివేశామని సీఎం వివరించారు. కరోనా మహమ్మారి ఎవరికీ అంతుపట్టకుండా తెలంగాణ సహా ప్రపంచాన్ని వేధిస్తోందన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కేంద్రం చేతుల్లో ఉందని, టీకా డోసులను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తోందని సీఎం వివరించారు.