“జల్సా” చిత్ర ప్రదర్శన ద్వారా రూ. కోటి విరాళం సేకరించి అభిమానం చాటుకున్న జన సైనికులు

* పీఏసీ సభ్యులు నాగబాబు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ కి చెక్ అందజేత
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని “జల్సా” చలన చిత్రం ప్రత్యేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించటం ద్వారా “నా సేన కోసం నా వంతు” అనే కార్యక్రమానికి రూ. కోటి విరాళం సేకరించి అభిమానం చాటుకున్నారు జన సైనికులు సాయి రాజేష్, ఎస్.కే.ఎన్., సతీష్ భొట్ట, ధర్మేంద్ర. రూ. కోటి చెక్ రూపంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారి చేతుల మీదుగా గురువారం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. “జల్సా” చలన చిత్రం ప్రత్యేక ప్రదర్శనలో కీలక భూమిక పోషించిన వారిలో ఉమా నాగేంద్ర, శ్రీధర్ ఉన్నారు. యతింద్ర, జ్ఞానవర్ష, నవీన్ సహకరించారు.
*అభిమానం ఫోటో కోసం ఆగకుండా రూ.కోటి విరాళం సేకరించే స్థాయికి ఎదిగింది: కొణిదెల నాగబాబు
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద జన సైనికులకు ఉన్న అభిమానం ఆయన్ను కలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ఫోటో దిగాలి అనే దానికే పరిమితం కాకుండా ఏదన్నా సాధించి, పార్టీ ఎదుగుదలకు తద్వారా సమాజ హితం కోసం ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారి మన్ననలు పొందాలి అనే స్థాయికి ఎదగడం అభినందనీయమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేశారు. జనసైనికులు సాయి రాజేష్, ఎస్.కే.ఎన్., సతీష్ భొట్ట, ధర్మేంద్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా “జల్సా” చలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించాలని పూనుకోవడం, తద్వారా సేకరించిన రూ. కోటి జనసేన పార్టీకి విరాళంగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేసి ఆయన మన్ననలు పొందడమనేది జనసైనికులకు, వీరమహిళలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కేవలం ఫోటో కోసం, మాటల కోసం మాత్రమే కాకుండా పార్టీకి ఉపయోగపడే పని ఏదన్నా చేసి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అనే వారి సంకల్పం, ఉమా నాగేంద్ర, శ్రీధర్, యతింద్ర, జ్ఞానవర్ష, నవీన్ అందించిన తోడ్పాటు ఫలించాయని అన్నారు. వృత్తిపరంగా వీరంతా వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్నప్పటికీ జనసేన అభివృద్ధికి దోహదపడాలనే ఆశయం కోసం వీరందరూ ఒక తాటిపై నడిచారని నాగబాబు గారు స్పష్టం చేశారు.