నేడు తుపానుగా.. రేపు అతి తీవ్ర తుపానుగా మారనున్న ‘యాస్’

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి, నిన్న వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు తుపానుగా, రేపు అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తరవాయవ్య దిశగా కదులుతోంది. రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్న ‘యాస్’ ఈ నెల 26న సాయంత్రం ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐడీఎం అధికారులు పేర్కొన్నారు.

‘యాస్’ కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే రేపటి నుంచి 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తుపాను తీరం దాటే వరకు గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో ఈ వేగం 155-165 నుంచి 185 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.