నేడు జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవం.. ఏడేళ్ల జనసేన ప్రస్థానం

ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలి అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో అడుగు పెడుతూ జనసేన పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఆవిర్భవించి మార్చి 14వ తేదీ 2021తో ఏడో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ ఏడేళ్ల జనసేన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు.. జయాపజయాలు ఉన్నాయి. అయినప్పటికీ జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో ముందుకు సాగుతున్నారు.

నిజానికి జన సేన అనగా ప్రజా సైన్యం అని అర్ధం. పార్టీ లోగో, రంగులు చే గువేరా, అనేక ఇతర ప్రభావవంతమైన నాయకుల వంటి విప్లవకారులను తలపించేలా ఉంటాయి. ఈ పార్టీ పేరు నమోదు కోసం పవన్ కళ్యాణ్ 2014 మార్చి 10 న ఎన్నికల సంఘాన్ని కలసి దరఖాస్తు చేశారు. 2014 డిసెంబరు 11 న ఎన్నికల సంఘం దీనిని ఆమోదించింది. 2014లో విభజన కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలని టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన బేషరతుగా తమ మద్దతు తెలిపింది. అయితే 2019 ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో క్రియాశీలక రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలకు ఏ కష్టనష్టాలు వచ్చినా నేను ఉన్నా అంటూ అందగానిలబడి వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. జనసేనాని వ్యక్తిత్వపరంగా ఒక విలక్షణమైన వ్యక్తి. అది తనతో పరిచయం ఉన్నవాళ్ళకి, తన అభిమానులకి కూడా బాగా తెలుసు. తనలో ఎక్కువ సామజిక సృహ దేశంకోసం మరేదో చెయ్యాలనే తపన, తన మాటల్లో తన చేతల్లో తన సినిమాల్లో మనం తరచూ చూస్తుంటాం. ఇందుకు పవన్ కళ్యాణ్ ఎక్కువగా చదివిన సోషలిస్టు, కమ్యూనిస్టు తరహా పుస్తకాల ప్రభావం వల్ల కూడా కావచ్చు. అందుకనే అయన సినిమాలు అంటే కేవలం సంపాదనే కాకుండా అదొక సామాజిక భాద్యత అని, భాద్యతగల పౌరుడిగా భావించే అతికొద్దిమందిలో నటుల్లో పవన్‌ కళ్యాణ్‌ ఒకరు.

ఇక పవన్ కళ్యాణ్ ను దేవుడిలా తాము ఆయన భక్తుల్లా కొలిచే అభిమానులు కూడా ఉన్నారు. ఇక పవన్‌ కూడా తన అభిమానులని కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి ఏదైనా కష్టం వచ్చింది అని తెలిస్తే వెంటనే స్పందిస్తారు కూడా. రాజు బలవంతుడు అయితే సైన్యం మరింత బలంగా పోరాటం చేస్తుందనే దానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ఆయన సేన చక్కటి నిదర్శనమని కార్యకర్తలు అంటుంటారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తమ ఓటు బ్యాంక్ ను మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం బీజేపీ తో కలిసి నడుస్తుంది.