నేడు లోటస్ పాండ్ లో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందుకు నాందిగా నేడు లోటస్ పాండ్ లో ఆమె ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం పైనే అందరి దృష్టీ ఉంది. అభిమానులతో భేటీ అంటున్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారేలా ఆమె సమావేశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. వైఎస్ అభిమానులు, అనుచరులు, తెలంగాణకు చెందిన వైసీపీ కార్యకర్తలు, పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 150 మంది ముఖ్య కార్యకర్తలతో షర్మిల సమావేశం కానున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో లోటస్‌పాండ్‌ ఇంటి దగ్గర భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ షర్మిల ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే వైఎస్ జగన్ ఫొటో మాత్రం ఒక్క చోట కూడా కనిపించట్లేదు. దీంతో కొందరు అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్స్ వస్తున్నాయి.