ఉక్కు పోరాటం నవయుగ చైతన్యానికి నాంది: నారా రోహిత్‌

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఆంధ్రులు చేస్తున్న పోరాటం రేపటి వెలుగుకు, నవయుగ చైతన్యానికి నాంది కావాలని హీరో నారా రోహిత్‌ పిలుపునిచ్చారు. రోహిత్‌ ఫేస్‌బుక్‌ వేదికగా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ”విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి కన్నబిడ్డ. ప్రస్తుత తరానికి, రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే తల్లి. తెలుగోడి అస్థిత్వానికి ప్రతీకగా నిలిచిన ఉక్కు ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు వెన్ను చూపడం తన నైజం కాదు.. సాటి ఆంధ్రుడికి కష్టమొచ్చినప్పుడు అండగా నిలబడతా. తెలుగు ఆత్మగౌరవంపై దాడి జరుగుతోంది. యువతా మేలుకో.. యువత తన పోరాట పటిమతో నవయుగ చైతన్యానికి నాంది పలకాలి. త్యాగధనుల పోరాట ఫలం పరాధీనమవ్వకుండా పిడికిలి బిగించాలి. తెలుగు వారి స్వాభిమానం అపహాస్యమవ్వకుండా ఐక్య పోరాటానికి కదిలిరా..’ అంటూ పేర్కొన్నారు. ఉక్కు పోరాటంలో తననూ భాగస్వామిని చేసిన కార్మిక లోకానికి వందనమన్నారు. త్వరలోనే విశాఖకు వచ్చి ఉక్కు ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతానని అన్నారు.