ఫిబ్రవరి నెలఖారుకు టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్‌

టీఎస్ ఎంసెట్ -2021 నోటిఫికేషన్ ఈ నెలఖారు నాటికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. లేదా మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎంసెట్ ఎగ్జామ్‌ను జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఇక ఎంసెట్ పరీక్షలను జులై 5 నుంచి 9వ తేదీ మధ్యలో షిఫ్టుల వారీగా నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ కోర్సులకు మొదట పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత అగ్రికల్చర్, మెడికల్ కోర్సులకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది ముందుగా అగ్రికల్చర్, మెడికల్ కోర్సులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఎందుకంట జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ జులై 3న ఉండటంతో.. ఆ పరీక్ష పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ కోర్సులకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. గతేడాది వరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు 160 చొప్పున ప్రశ్నలు ఇచ్చేవారు. కానీ ఈ ఏడాది ఆ ప్రశ్నలను 180కి పెంచనున్నారు. అయితే జవాబులు మాత్రం కేవలం 160 ప్రశ్నలకే రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నల పెంపునకు సంబంధించి కమిటీ అధ్యయనం చేస్తోంది. ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్టీయూ రెక్టార్‌ డాక్టర్‌ గోవర్ధన్‌ను నియమించారు.