జనసేన ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామయ్య భక్తులకు అన్నదానం

రాజంపేట, ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణానికి విచ్చేయు భక్తులకు రాజంపేట జనసేన అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సహకారంతో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి నందు ఉప్పరపల్లె గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. కోదండ రాముని కళ్యాణం తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తారనే ఉద్దేశ్యంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామన్నారు. రామ భక్తులందరికీ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు దేవుడిచ్చిన వరమన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన రాజంపేట జనసేన ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణకు ఒంటిమిట్ట కోదండ రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నేతలు భాస్కర్ పంతులు, గోపి, ఆచారి, పోలిశెట్టి శ్రీనివాసులు, హేమంత్, కిషోర్, జనసేన వీరమహిళ శారద, జెడ్డా శిరీష తదితరులు పాల్గొన్నారు.