నిరుద్యోగ భృతి ప్రకటన విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్‌ నిరుద్యోగ భృతిపై నిన్న స్పందించిన విషయం తెలిసిందే. రేపో, మాపో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై ప్రకటన చేస్తారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అయితే.. దీనిపై బీజేపీ నేత విజయశాంతి రివర్స్‌ కామెంట్‌ చేశారు. “నిరుద్యోగుల భృతి పై ఈ రోజు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ గారు స్పందిస్తూ త్వరలో స్పష్టత వస్తుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి లేదా ఆర్థికమంత్రి ప్రకటించకపోయినా… ప్రస్తుత టీఆరెస్ ప్రభుత్వ పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రకటనకు విలువ ఉంటుంది. అయితే, నిరుద్యోగులకిచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే ఒకొక్కరికీ సుమారుగా రూ.75 వేలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నట్టు తేలింది. మొదట దానిని చెల్లించి, తర్వాత మిగతా ముచ్చట్లు చెబితే మంచిది. అది విడిచి, ఏదో గారడీ కార్యక్రమం మళ్లా మొదలుపెడితే నిరుద్యోగుల తిరుగుబాటు, ఉద్యమాలను ఎదుర్కునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధపడాల్సి రావచ్చు. దుబ్బాక, జీహెచ్ఎంసీలలో బీజేపీ గెలుపు ఫలితాలతోనే ఇంత కదలిక కనబడుతున్నదంటే… రానున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక, కార్కొరేషన్లు, ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టిగా కర్రు కాల్చి ఈ కారు సర్కారుకు ఇంకొంత వాత పెడితే మరికొంత చలనం కలిగే అవకాశం ఉండచ్చు.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.