పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారితో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారు శనివారం రాత్రి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ గారి 

నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించాం. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశాం. సుహృధ్బావంగా చర్చిస్తున్నాం. మేము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయి. రెండు స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉంది. దీనిపై మరోసారి మాట్లాడుకుంటాం. మా పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారు.
• శ్రీ నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలి
ఇటీవల జరిగిన ఎన్డీయే మీటింగులో కూడా ఈ దేశానికి మరోసారి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడాము. ఈ దేశానికి ముచ్చటగా మూడోసారి శ్రీ మోడీ గారు ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఇందుకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో శ్రీ మోడీ గారు పాల్గొంటారు. ఈ సభకు నన్ను ఆహ్వానించారు. ఈ సభలో పాల్గొంటాను” అన్నారు. శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ “ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ మాకు జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో ఎంతో సహకరించింది. ఇందుకు శ్రీ పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉంది. జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. రెండు సీట్ల అంశంపై చర్చించాల్సి ఉంది. ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొంటారు. ఈ సభకు శ్రీ పవన్ కల్యాణ్ గారిని ఆహ్వానించాం” అన్నారు. డా.లక్ష్మణ్ గారు మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉంది. ఈ దేశానికి మరోసారి శ్రీ మోడీ గారు ప్రధాన మంత్రి కావల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా భాగస్వామ్య పక్షంగా జనసేన మద్దతుతో తెలంగాణ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాము” అన్నారు.