బ్రిటన్‌ నుంచి భారత్‌కు రానున్న వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు!

కరోనాతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు యూకే సాయం అందించడానికి ముందుకు వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలను ఇండియాకు పంపుతున్నట్లు ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు సహా కీలక పరికరాలను భారత్‌కు అందిస్తున్నట్లు తెలిపారు.

తొలి విడత సరకు మంగళవారం భారత్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. తర్వాత వారం పాటు దశలవారీగా మిగిలిన పరికరాలు భారత్‌కు రానున్నాయి. బ్రిటన్‌ నుంచి మొత్తం 600 యూనిట్ల వైద్య పరికరాలు అందనున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పలు దేశాలు భారత్‌కు సంఘీభావం ప్రకటించాయి. సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఫ్రాన్స్‌, అమెరికా, జర్మనీ, చైనా, పాకిస్థాన్‌ ఈ దేశాల జాబితాలో ఉన్నాయి.