టీఆర్ఎస్ తీరుపై విజయశాంతి ఆగ్రహం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అధికార టీఆర్ఎస్ పార్టీ పై మరోసారి ఫైర్ అయింది. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజక వర్గంలో టీఆర్ఎస్ ప్రదర్శిస్తోన్న తీరు సరికాదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దుబ్బాక ఎన్నికలో అధికార టీఆర్ఎస్ సర్వ విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే టీఆర్ఎస్ ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు ప్రారంభించింది’ అని ఆమె ఆరోపించారు. ‘గత కొన్నిరోజులుగా మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా? కాదా? అన్న సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయి’ అని విజయశాంతి అన్నారు.