కాబూల్ వరుస పేలుళ్లకు కారణం మేమే: ప్రకటించిన ఐసిస్

కాబూల్‌లో రక్తపాతం సృష్టించిన వరుస పేలుళ్లు తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది అమెరికా రక్షణ సిబ్బంది సహా మొత్తం 72 మంది వరకు చనిపోయారు. మరో 143 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తొలుత విమానాశ్రయం వద్ద కొన్ని నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగ్గా ఆ తర్వాత కొన్ని గంటలకు సెంట్రల్ కాబూల్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాజాగా ప్రకటించిన ఐసిస్.. అబే గేటు వద్ద జరిగిన పేలుడుకు సంబంధించి ఆత్మాహుతి బాంబర్ ఫొటోను విడుదల చేసింది.