కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తాం

గుంటూరు, కార్మికుల న్యాయ సమ్మతమైన డిమాండ్లు నెరవేర్చేవరకు కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు జనసేన పార్టీ పూర్తి మద్దతునిస్తుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ఆధ్వర్యంలో కార్మికుల సమ్మెకు మద్దత్తుగా జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమి కాదని అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి ఇచ్చిన హామీలేనన్నారు. తనని తాను పేదల పక్షపాతిగా అభివర్ణించుకునే జగన్ రెడ్డికి పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు ఎందుకు పట్టడం లేదని బోనబోయిన ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాది మనసున్న ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రికి కార్మికుల జీతాన్ని పెంచటానికి మనసెందుకు రావటం లేదన్నారు. నలభై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి కూడా ఉద్యోగ భద్రత లేకపోవడం దుర్మార్గమన్నారు. నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ కార్మికుల పక్షపాతి అన్నారు. కార్మికులకు గుర్తుగా ఎర్ర కండువాను మెడలో వేసుకుంటారని , జనసేన అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని నేరేళ్ళ సురేష్ అన్నారు. రాష్ట్ర కార్మిక యూనియన్ సభ్యులు సోమి శంకరరావు, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్ జనసేన పార్టీ, టీడీపీ నేతలు, టీ.యన్.టీ.యు.సీ నాయకులు నాగ గౌడ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.