లాభాపేక్ష లేకుండా భారత్‌కు టీకాలు అందజేస్తాం: ఫైజర్‌

ఎలాంటి లాభాపేక్ష లేకుండా భారత్‌కు కొవిడ్‌ టీకాలు సరఫరా చేస్తామని అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ప్రకటించింది. భారత్‌లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఒప్పందాల ద్వారానే టీకాలు అందజేస్తామని స్పష్టం చేసింది. అందరికీ టీకా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించింది. అయితే, ఏ ధరకు టీకాను అందజేస్తారనే విషయం మాత్రం ఫైజర్‌ వెల్లడించలేదు.

దేశంలో కరోనా ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని టీకా అవసరాల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇతర దేశాల్లో ఆమోదం పొందిన సమర్థమైన టీకాలను భారత్‌లో కూడా అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఇప్పటివరకు దేశంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు మాత్రమే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాకు ఆమోదం లభించినప్పటికీ.. ఇంకా వినియోగంలోకి రాలేదు.