జనసేన తరపున అండగా నిలబడతాం: గునుకుల కిషోర్

రాచర్లపాడు, కోవూరు నియోజకవర్గం రైతు ఆధారిత పరిశ్రమలు స్థాపిస్తాం అని 3 వేల ఎకరాల పై చిలుకు భూమిని సేకరించిన ఇఫ్ఫ్కో కిసాన్ సెజ్ ఎంత మంది రైతులకు ఉపయోగపడింది. ఇంకా బ్రిటిష్ రాజ్యం కొనసాగుతుందా అనిపిస్తుంది, భూమి ఇచ్చిన గ్రామాలు ఆ కంపెనీ పహరాలో ఉన్నాయి. 20 ఏళ్లు గడిచినా భూమి ఇచ్చిన రైతులకు పరిహారం అందలేదని స్థానిక జనసైనికులు అభ్యర్థన మేరకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ రాచర్లపాడు గ్రామ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న కిషోర్ వారికి జనసేన పార్టీ తరపున అండగా నిలబడతామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సేద్యం చేసే రైతులు రాబోయే తరానికి మంచి జరుగుతుందని తలచి భూమి ఇచ్చిన పాపానికి ఆకలి, అనారోగ్యంతో అల్లాడుతున్నారు. 20 ఏళ్ళకి పరిహారం అందక పోవటం దారుణం. దాదాపు 1000 ఎకరాలు కోదండ రామస్వామి ఆలయం భూములు, 1000 ఎకరాలు ఇస్రో నిరాశ్రయుల భూములను అసైన్డ్ భూములుగా మరికొంత స్థానిక రైతుల ద్వారా మొత్తం సుమారు 3వేల ఎకరాలు దారాదత్తం చేసిన పెద్దలకు ఎంత ముట్టింది. రానున్న తరాలకు మంచి జరుగుతుందని, నష్ట పరిహారం అందుతుందని, ఇంటికో ఉద్యోగం దొరుకుతుందనీ, ఎదురు చూపులు చూస్తున్న స్థానికులకు స్వీపర్లుగా కూడా పెట్టుకోవక పోవటం దారుణం. రైతులకు న్యాయం చేస్తామని దాదాపు 3 వేల ఎకరాలు సేకరించిన సంస్థకు తిరిగి అమ్మే హక్కు ఎక్కడిది. కోట్ల రూపాయలకు స్థలాలను ఫ్యాక్టరీలకు అమ్ముతూ రైతులకు కనీస పరిహారం ఇవ్వకుండా స్థానికంగా ఉన్న చెరువుకు పూడిక తీయటానికి కూడా స్థానికులకు హక్కు లేదని జులుం చూపిస్తున్న ఈ సంస్థలపై ప్రభుత్వ కంట్రోల్ ఉందా. భూమిని ఇచ్చిన గ్రామాల్లో ఎవరైనా కొత్తవారు వస్తే ఎక్కువ సంస్థల వాళ్ళు పహరా కాస్తూ వీడియోలు తీస్తున్నారు. ఇంకా బ్రిటిష్ రాజ్యం కొనసాగుతుందా అనిపిస్తుంది. స్థానికంగా 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్నా ఇప్పటికీ ఇంటి ద్రువపత్రం కనీసం పొందలేని స్థితిలో ఉన్న స్థానికులకు అండగా నిలబడతామని ఈ సమస్యను పవన్ కళ్యాణ్ కి దృష్టి వరకు తీసుకెళ్లి, వారికి పరిహరం అందే వరకూ జనసేన తరపున పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, చిన్న రాజా, మౌనేష్, వరతో పాటు స్థానికులు మరియు భూమిని ఇచ్చిన రైతులు పాల్గొన్నారు.