అధికార పార్టీ ఆగడాలపై ఎస్‌ఇసి ఎందుకు స్పందించడం లేదు?

అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో టిడిపితో పోటీపడలేక ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటు.. అధికార పార్టీ ఆగడాలపై ఎస్‌ఇసి ఎందుకు స్పందించడం లేదు ? అని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈమేరుకు ఆదివారం చంద్రబాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ఎస్‌ఇసి, పోలీసులపై ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, బెదిరింపులు, దౌర్జన్యాలతో జగన్‌ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. పేదల భూములు వైసిపి నేతలు కబ్జా చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియను కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో 20 ఏళ్లుగా టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు షాపును అక్రమంగా తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. పలాసలో బెదిరింపులకు గురి చేసి పోటీ చేసే అభ్యర్థులను వైసిపి లో చేర్చుకున్నారని ఆరోపించారు. పోటీ నుండి తప్పుకోకపోతే టిడిపి అభ్యర్థులపై వైసిపి విష పంజా విసురుతోందన్నారు. జగన్‌ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్చమైందని ఎద్దేవా చేశారు.

జగన్‌ రెడ్డి ఆదేశాలతోనే రాష్ట్రంలో ఇలాంటి వికఅతి చేష్టలకు వైసిపి నాయకులు పాల్పడుతున్నారని అన్నారు. కొర్పొరేటర్‌ గా టిడిపి తరపున శ్రీనివాసులు పోటీ చేస్తున్నారనే కక్షతోనే షాపును తొలగించారని, చేతనైతే ప్రజాబలంతో నెగ్గాలి తప్ప బెదిరింపులతో కాదు అని అన్నారు. శ్రీనివాసులుకు టిడిపి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. అన్ని రికార్డులు ఉన్నా షాపును తొలగించడం కుట్ర కాదా?

అని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై ఎస్‌ఇసి తక్షణమే స్పందించాలని కోరారు. ఎస్‌ఇసి ఎందుకు మౌనం వహిస్తుందో అర్థం కావడంలేదన్నారు. కళ్లెదుటే అన్యాయాలు జరుగుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ఎస్‌ఇసి, పోలీసులపై ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు లంగకపోతే చంపుతున్నారని, నామినేషన్‌ వేసిన దగ్గర నుండి ఎన్నికలయ్యే వరకు ఏం జరగుతుందో అంతుబట్టని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని చెప్పారు. గతంలో ఏనాడైనా ఇలాంటి దుస్థితి ఏర్పడిందా?

అని మరోసారి ప్రశ్నించారు. అక్రమాలు, అరాచకం, విచ్చలవిడి ప్రలోభాలకు తెగబడి వైసిపి నాయకులు వారి నైజాన్ని నిరూపించుకుంటున్నారని. టిడిపి అభ్యర్థుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దాడులు, బెదిరింపులకు తెగబడితే ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేల్చుతామని చంద్రబాబు పేర్కొన్నారు.