చెన్నైకి సమీపంలో తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో పలుచోట్ల వర్షాలు

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గడచిన ఆరు గంటలుగా గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయుగుండం భూ భాగంపైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో వైపు వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు. అత్యవసర సహాయ చర్యల కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పంపించినట్టు పేర్కొన్నారు. మరో వైపు ఈనెల 13న అండమాన్‌ తీర ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వెల్లడించారు. నవంబర్‌ 17 నాటికి ఇది మరింత బలపడి కోస్తాంధ్ర వద్ద తీరాన్ని దాటే అవకాశమున్నట్టు విపత్తు నిర్వహణశాఖ స్పష్టం చేసింది.