ప్రభుత్వానికి గవర్నర్‌ మార్గదర్శి.. 51వ గవర్నర్ల సదస్సులో రాష్ట్రపతి

ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ”మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త” అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. గవర్నర్లు రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో సజీవ సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సేవ కోసం కట్టుబడి ఉన్నామని గవర్నర్లు గుర్తుంచుకోవాలని అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో గురువారం నిర్వహించిన 51వ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవరుర్ల సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించడంతోపాటు జాతీయ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేయడంలో గవర్నర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రజలతో ”నిరంతర సంబంధాలు” కొనసాగించాలని కోవింద్‌ అన్నారు. కొన్ని కార్యక్రమాల ద్వారా ఆ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాలను తప్పనిసరిగా సందర్శించారని కోరారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో గవర్నర్లు చురుకైన సహకారం అందించారని అన్నారు. 108 కోట్ల టీకాలు వేయడం ద్వారా కరోనా నుంచి దేశ ప్రజలను రక్షించే లక్ష్యంతో వేగంగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. భారతదేశం ‘వ్యాక్సిన్‌ మైత్రి’, చొరవ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతున్నాయని అన్నారు.

ప్రజలను చైతన్య పరచండి : వెంకయ్యనాయుడు
దేశాభివృద్ధిలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యేలా వారిని చైతన్య పరచాలని గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ సమర్థవంతంగా అమలు కావడంలోనూ చొరవ తీసుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం, జల సంరక్షణ, చెత్త నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం వంటి పర్యావరణ అనుకూల చర్యలు చేపట్టే దిశగా ప్రజలను ప్రోత్సహించాలన్నారు.

ఎన్‌ఇపి అమలులో గవర్నర్లది కీలక పాత్ర : అమిత్‌ షా
కాప్‌ 26 సమావేశంలో మనదేశం తీసుకున్న లక్ష్యాలను సాధించేందుకు వీలుగా వాతావరణ మార్పులపై సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కోరారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)నిక్షేత్రస్థాయిలో అమలు చేయడంలో యూనివర్శిటీల ఛాన్సలర్లుగా గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ గవర్నర్లు విశ్వభూషన్‌ హరిచందన్‌, తమిళి సై తదితరులు పాల్గొన్నారు.