రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, అజయ్ కుమార్ రెడ్డిలకు అభినందనలు

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపిక కావడం క్రీడాభిమానులందరూ ఆనందించదగ్గ విషయమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. సాత్విక్ కి నా అభినందనలు. ఆయన మరిన్ని విజయాలు, పురస్కారాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. చూపునకు నోచుకోని క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అర్జున అవార్డుకి ఎంపిక కావడం ముదావహం. అంధుల క్రికెట్లో రాణించి కెప్టెన్ స్థాయికి ఎదిగిన అజయ్ కి హృదయపూర్వక అభినందనలు. తనకు ఎదురైన అవరోధాలన్నింటినీ అధిగమించి విజయాలు సాధించడం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి అర్జున పురస్కారాలకు ఎంపికైన క్రీడాకారులు ఇషా సింగ్ (షూటింగ్), మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్)లకు అభినందనలు తెలియచేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.