ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారు

రాష్ట్రంలో వరుసగా ఆడబిడ్డలపై అత్యాచారాలు, వేధింపులు చోటు చేసుకొంటుంటే బాధ్యత కలిగిన మంత్రులు మాత్రం తల్లి పెంపకమే తప్పు అంటూ తప్పించుకొంటున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది కచ్చితంగా పాలకుల వైఫల్యమే. ఈ పరిస్థితులను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దిశ చట్టం ఎటుపోయింది? మహిళలకు రక్షణ ఇవ్వండి… అని ప్రశ్నించినా… వినతి పత్రం ఇవ్వబోయినా… నిరసన తెలిపినా కేసులు నమోదు చేస్తున్నారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి కోట వినుత అధ్వర్యంలో తిరుపతిలో మహిళలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపడితే అడ్డుకోవడం భావ్యం కాదు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న శ్రీమతి వినుత, ఆమె భర్త శ్రీ కోట చంద్రబాబు, ఇతర నాయకులపై పోలీసులు అనుసరించిన వైఖరి అప్రజాస్వామికం. అరెస్టు చేసిన విధానాన్ని, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.