నాదెండ్ల ఆధ్వర్యంలో ద్వారపూడి రోడ్ శ్రమదానం

నాదెండ్ల పర్యటనను విజయవంతం చేయాలి.
మండపేట జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పిలుపు.

మండపేట, రాష్ట్రపతి దృష్టికి వెళ్ళిన మండపేట ద్వారపూడి రోడ్ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ రోడ్ వార్తల్లో ఎక్కింది. జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఈ రోడ్డులో శ్రమదానం నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ రోడ్డుపై పడింది. గతంలో రాష్ట్రపతి కార్యాలయం స్వయంగా ఈ రోడ్ అంశంలో కలుగచేసుకోగా సమస్య పరిష్కారం మాట అటుంచి మరింత జటిలంగా మారింది. ఇప్పుడు చిన్న గోతులు కాస్తా పెద్దవిగా అభివృద్ధి చెందాయి. ఉయ్యాల జంపాల మాదిరి ప్రయాణం నరకంగా మారింది. ఈ క్రమంలో మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ఈ రోడ్ దుస్థితి అధినేత పవన్, నాదెండ్ల దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ అలసత్వంను ఎత్తి చూపుతూ జనసైనికులు ఈ రోడ్డును శ్రమదానంతో మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల పర్యటనను విజయవంతం చేయాలని మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా డిసెంబర్ 1వ తేదీ బుధవారం మండపేటలో నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారని తెలిపారు. ఉదయం 10 గంటలకు మండపేట-ద్వారపూడి రోడ్డు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో భేటి కానున్నారని తెలిపారు. కావున నియోజకవర్గ నలుమూలల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులు విచ్చేసి ఘన స్వాగతం పలికి, ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.