జనసేన… జాతీయ భావాలున్న పార్టీ

* మహానుభావుల త్యాగాలను భావి తరాలకు తెలియజేస్తాం
* రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముసుగులో నియంత పాలన సాగుతోంది
* ప్రజల హక్కులను కాలరాస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
* పోరాటానికి సిద్ధమవుదాం
* మంగళగిరిలో వీరమహిళ విభాగం సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీ. అయితే మన సిద్ధాంతాలు, భావజాలం జాతీయ స్థాయిలో దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షణ కోసం ఉంటాయ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. ఎంతో మంది త్యాగమూర్తుల ఆత్మబలిదానాలు, పోరాటాలతో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ త్యాగ ఫలాలను కొంతమంది స్వార్థపరులు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజల హక్కులను కాలరాస్తూ… వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ వీర మహిళ విభాగంతో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు గడిచి, 77వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. ఎంతోమంది మహానుభావులు ఎన్నో త్యాగాలు చేస్తే మనకు ఈ స్వాతంత్ర్యం వచ్చింది. వారి స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్దాం. ఇలాంటి పండుగ రోజు సోదరీమణులైన వీర మహిళలతో జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఏ పార్టీకి లేని మహిళా శక్తి జనసేన పార్టీకి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిన్న పిలుపు ఇస్తే చాలు పార్టీ తరఫున జెండా పట్టుకొని ముందుగా నిలబడేది వీరమహిళలే.
* జన సైనికుడిగా గర్వపడుతున్నా
జనసేన పార్టీ స్థాపించి దశాబ్ధ కాలం అయ్యింది. ఈ పదేళ్ల కాలంలో ఎలాంటి పదవులు ఆశించకుండా నిస్వార్థంగా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తనవంతు పోరాటం చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనుకునే వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఒక తెలుగువాడిగా, జన సైనికుడిగా ఆయనతోపాటు కలసి పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. కొంతమంది పాలకులు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతుంటే.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దేశం, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వ్యక్తులను నిత్యం స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నారు.
* కల్లూరు తులసమ్మ లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోండి
మన రాష్ట్రంలో తెనాలి ప్రాంతానికి చెందిన శ్రీమతి కల్లూరు తులసమ్మ గారు.. గాంధీ గారి సిద్దాంతాలు నచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. శరీరం మీద ఉన్న విలువైన ఆభరణాలను ఉద్యమం కోసం సమర్పించారు. గాంధీ గారి పిలుపు మేరకు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయి 16 నెలలు జైల్లో గడిపారు. ఆ ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారు జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు. అనంతరం ఆచార్య వినోబా భావే ప్రారంభించిన ‘సర్వోదయ ఉద్యమం’లో కార్యకర్తగా పనిచేసారు. ఆ రోజుల్లో ఊరూరా కాలి నడకన తిరిగి ఖద్దరు అమ్మకంపై వచ్చిన ఆదాయం మూడు వేల రూపాయలతో పెదరావూరు గ్రామంలో కొనుగోలు చేసిన సొంత ఇంటిని 1977లో గుంటూరు జిల్లా ఖాదీ సంస్థకు విరాళంగా అప్పగించారు. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్లాలి.
* నియంతలను ఎదుర్కొందాం
రాష్ట్రంలో ప్రజాస్వామ్య ముసుగులో నియంత పాలన సాగుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం ఎదుర్కొందాం. భవిష్యత్తు పోరాటానికి కలిసికట్టుగా సిద్దమవుదాం. దేశం, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా, వారిలో స్ఫూర్తి నింపేలా జయంతి, వర్థంతి కార్యక్రమాలను పార్టీ తరఫున నిర్వహిస్తాం” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ వీర మహిళ విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు, మహిళ నేతలు, వీర మహిళలు పాల్గొన్నారు.