భారత్‌ బోణి.. కివీస్‌పై గెలిచిన రోహిత్ సేన

న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ బోణీ చేసింది. బుధవారం జరిగిన మొదటి టీ20లో ఐదు వికెట్లతో భారత విజయం సాధించింది. అయితే న్యూజిలాండ్‌ విధించిన 165 పరుగుల లక్ష్య చేధన కోసం చివరి ఓవర్‌ వరకూ భారత్‌ పోరాడాల్సి వచ్చింది. లక్ష్య చేధనలో ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (15 పరుగులు) త్వరగానే నిష్క్రమించినా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (48 పరుగులు (36 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లు)ా సూర్యా కుమార్‌ యాదవ్‌ (62 పరుగులు, 40 బంతుల్లో మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లు) జోడీ దాటిగా ఆడింది. అయితే జట్టు స్కోరు 109 వద్ద రోహిత్‌, 144 వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌ నిష్క్రమించారు. 19 ఓవర్‌ చివరి బంతికి శ్రేయాస్‌ అయ్యార్‌ (5) అవుటయ్యాడు. చివరి 6 బంతుల్లో భారత్‌ విజయం కోసం 10 పరుగులు కావాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలో చివరి ఓవర్‌లో మొదటి బంతిని డారియల్‌ మిచ్చెల్‌ వైడ్‌గా వేశాడు. తొలి బంతిని బౌండరీగా మలచిన వెంకటేష్‌ అయ్యార్‌ రెండో బంతికి పెవిలియన్‌ చేరుకున్నాడు. అయితే ఈ తరువాత వైడ్‌ రూపంలో మరొక పరుగు లభించింది. నాలుగో బంతిని రుషిబ్‌ పంత్‌ బౌండరీగా మార్చడంతో ఇంకా రెండు బంతులు మిగిలిఉండగానే విజయం భారత్‌ను వరించింది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ ఈ నెల 19న రాంచీలో జరుగుతుంది.

బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా బౌలింగ్‌ ఎంచుకుని కివీస్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

తొలి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ (0)ను భువనేశ్వర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్‌ చాప్‌మన్‌ (63: ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)తో కలిసి మరో ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (70: మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి శతక (109) భాగస్వామ్యం నిర్మించారు. అయితే, వెంటవెంటనే చాప్‌మన్‌తోపాటు ఫిలిప్స్‌ (0) పెవిలియన్‌కు చేరాడు. ఈ రెండు వికెట్లను అశ్విన్‌ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఫర్ట్‌ (12)తో కలిసి గప్తిల్‌ ధాటిగా ఆడాడు. మళ్లీ గప్తిల్‌, సీఫర్ట్‌ స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో కివీస్‌ స్కోరు బోర్డు వేగం తగ్గిపోయింది. కివీస్‌ బ్యాటర్లలో రచిన్‌ రవింద్ర 7, సాట్నర్‌ 4లి పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 2, భువనేశ్వర్‌ 2.. చాహర్‌, సిరాజ్‌ చెరో వికెట్‌ తీశారు.